హైదరాబాద్ : గోదావరి నదికి భారీగా వరద పోటెత్తుతున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో 19.04లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం సాయంత్రం 5 గంటలకు 61.80 అడుగులకు చేరింది. 1976 నుంచి నది 60 అడుగుల మార్క్ను దాటడం ఇది ఎనిమిదోసారి. వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి వంతెనను మూసివేశారు.
భారీ వరద నేపథ్యంలో వంతెనపై రాకపోకలు నిలిపివేయడంతో పాటు భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. అయితే, భద్రాచలం వంతెన చరిత్రలో రాకపోకలు నిలిపివేయడం ఇది రెండోసారి. 1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరిన సమయంలో రాకపోకలను నిలిపివేశారు. మళ్లీ 36 సంవత్సరాల భారీగా వరద వస్తుండడంతో ఆంక్షలు విధించారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ఆంక్షలు అమలులోకి రాగా.. 48 గంటల పాటు కొనసాగనున్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్కు రాకపోకలు నిలిచిపోయాయి.