హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత పంచాయతీలకు పోలింగ్ (Panchayathi Elections) ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ను ఎన్నుకుంటారు. రెండో విడతలో భాగంగా 4,333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో 5 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో రెండు గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. 415 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,911 గ్రామాల్లో పోలింగ్ జరుగుతున్నది. మొత్తం 12,782 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 38,350 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా, 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా, 71,071 మంది పోటీలో ఉన్నారు.
31 జిల్లాల్లో మొత్తం 57,22,665 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 27,96,006 పురుషులు, 29,26,306 మంది మహిళలు ఉండగా, మరో 153 మంది ఇతరులు ఉన్నారు. రెండో విడత ఎన్నికల కోసం 38,337 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ప్రాంతాలు మినహా 3,769 పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్కాస్టింగ్ చేస్తున్నారు.
