హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్లో సీట్లు వెలవెలబోతున్నాయి. ఏటా 40శాతానికి పైగా ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోతున్నాయి. ఐదేండ్లలో ఇంజినీరింగ్ సీట్ల ఖాళీల వివరాలపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ సమాధానమిచ్చారు. 2017 -18లో 14,65,873 సీట్లుంటే, 7,22,112 సీట్లు మిగిలాయి. 201819లో 13,95,345 సీట్లుంటే, 6,78,932 ఖాళీగా ఉన్నాయి. 2019-20లో13,28,247 సీట్లుండగా, 5,87,314 సీట్లు మిగిలాయి. 2020-21లో 12,86,545 సీట్లుండగా, 5,66,538 సీట్లు మిగిలాయి. 2021 -22కు వచ్చేసరికి 12,53,337 సీట్లుండగా, 4,21,203 సీట్లు మిగిలినట్టు వివరించారు. డిమాండ్ సప్లయ్ సూత్రం ఆధారంగా ఇంజినీరింగ్ సీట్లు నిండుతాయని, ఏ ప్రాంతంలో అత్యధికంగా కాలేజీలున్నాయో అన్న అంశం కూడా ప్రభావితం చేస్తుందని తెలిపారు.