హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్-సిద్దిపేటకు కొత్తగా ఏర్పాటు చేసిన రైలు సర్వీసులో రోజువారీగా ప్రయాణం చేసేవారి కోసం సీజనల్ టికెట్ విధానాన్ని ప్రవేశ పెడుతూ దక్షిణమధ్యరైల్వే జోనల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నెల రోజులపాటు నడిచే సీజనల్ టికెట్ ధరను రూ.440గా నిర్ణయించారు. ఏదైనా రైల్వేస్టేషన్ నుంచి ఈ సీజనల్ టికెట్లు పొందవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఉద్యోగాలు, వ్యాపారాల అవసరాల దృష్ట్యా సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కు వచ్చే ప్రయాణికులకు ఈ సీజనల్ టికెట్ విధానం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.