హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఏడాది ఒకేసా రి ఎండలు, వానలు వస్తున్నాయి. హీట్ హైల్యాండ్ ఎఫెక్ట్తో పాటు ఉత్తరాది నుంచి వస్తున్న గాలులతో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయని, దీంతో వడగాలులు మార్చి, ఏప్రిల్ నెలల్లోనే వచ్చాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన ఎండల కారణంగా ఆ వెంటనే ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయని అంటున్నారు.
కాలుష్యం, పట్టణీకరణ, పారిశ్రామికీకరణల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా గత 50 ఏండ్లలో ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగిందని టీఎస్డీపీఎస్ కన్సల్టెంట్, సీనియర్ సైంటిస్ట్ వైవీ రామారావు చెప్పారు. 2002-03, 2003-04 సంవత్సరాలలో గోదావరి, కృష్ణా నదుల్లో చుక్కనీరు లేని పరిస్థితిని చూశామని, పుష్కరాల కోసం నదిలో బోర్లు వేసి నీటిని వినియోగించుకున్నామని మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ చైర్మన్ డాక్టర్ ప్రసన్నకుమార్ గుర్తుచేశారు. గత 12 ఏండ్లలో వర్షాల తీరును పరిశీలిస్తే చెన్నై, ముంబై, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో క్లౌడ్ బరస్ట్లు ఏర్పడ్డాయని అన్నారు. ఈసారి విచిత్రంగా ఉదయం చల్లగా ఉంటున్నదని, మధ్యాహ్నం అయ్యే వరకు విపరీతమైన ఎండలు ఉంటున్నాయని, సాయంత్రం అయ్యేసరికి ఒకేసారి మబ్బులు కమ్మి వర్షం వస్తున్న పరిస్థితి చూస్తున్నామని తెలిపారు.