హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): వ్యక్తిగత వాహనాల్లో కూడా ప్రజా రవాణా సేవలు అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నిబంధనలు నూతన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1నుంచి అమల్లోకి రానున్నాయి. గతేడాది ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల్లో నాన్ కమర్షియల్ వాహనాల్లో ప్రయాణికుల రైడ్కు అవకాశమిచ్చింది. అందుకోసం ప్రయాణికుల భద్రతకు వాహనదారుడు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ చేయాల్సి ఉంటుంది. ఒకే నగరం పరిధిలో రోజుకు నాలుగు ట్రిప్పులు, ఏవైనా రెండు నగరాల మధ్య రెండుసార్లు మాత్రమే వ్యక్తిగత వాహనదారులు ప్రయాణికులను చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం వాహనదారులు నిర్దేశిత ఫీజును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న వాహన పన్నులకు ఈ ఫీజులు అదనంగా చెల్లించాలి.
తొమ్మిది కంటే తక్కువ సీట్లు ఉన్న నాన్ ఏసీ వాహనాకి ఏడాదికి 15 వేల రూపాయలు, ఏసీ వాహనానికి 25 వేల రూపాయలు చెల్లించి టూరిస్టు పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. డ్రైవర్ రోజులో 12 గంటలు మించి కారును నడుపరాదని పేర్కొన్నారు. డ్రైవర్కు మెడికల్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తప్పకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టంచేస్తున్నాయి. డ్రైవర్కు ఏడాదికి ఒకసారి శిక్షణ కార్యక్రమం ఉండాలి. డ్రైవర్, కారుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ‘సారథి’లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలపై ప్యాసింజర్ వాహన సంఘాలు మండిపడుతున్నాయి.
ఇప్పటివరకు ఎల్లో నంబర్ ప్లేట్ ఉన్న వాహనాల్లో మాత్రమే ప్రజారవాణా ఉన్నది. కానీ కేంద్రం తెలుపురంగు నంబర్ ప్లేట్ వాహనాల్లో ప్యాసింజర్లను తరలించటానికి అనుమతిస్తే ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ డ్రైవర్ల జేఏసీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తంచేశారు. వాహనాల ఫిట్నెస్ ప్రయాణికుల భద్రతకు కీలకమని, కొత్త మార్గదర్శకాలతో అది ప్రశ్నార్థకమవుతుందని పేర్కొన్నారు.
ఇవీ కూడా చదవండి
ఆరేళ్ల పిల్లాడు అద్భుతాన్ని కనిపెట్టాడు
భిన్నంగా పురుషులు, మహిళల మెదళ్లు.. ఎందుకో తెలుసా..?