హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): అసలే దేశం ఆకలి రాజ్యంగా తయారవుతున్నదని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ హెచ్చరించింది. 117 దేశాలతో పోల్చితే మన దేశం 102వ స్థానంలో ఉన్నదని తెలిపింది. ఇదేమీ పట్టని కేంద్రంలోని మోదీ సర్కారు.. పీఎం పోషణ్ అభియాన్కు ఏటా నిధులు తగ్గిస్తూ బడి పిల్లల కడుపును మాడుస్తున్నది. ఏటికేడు నిధుల్లో కోతలు పెడతూ అత్తెసరుగా కేటాయింపులు చేస్తున్నది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం పీఎం పోషణ్కు రూ.1267 కోట్లు కోత విధించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు పోషకాహారాన్ని అందించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 11.20 లక్షల పాఠశాలల్లో 11.80 కోట్ల విద్యార్థులు ఈ పథకం ద్వారా కడుపు నిండా తింటున్నారు. అయితే, మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2018లో మధ్యాహ్న భోజన పథకం పేరును పీఎం పోషణ్గా మార్చింది. 2021-22 నుంచి 2025-26 వరకు ఐదేండ్ల పాటు పీఎం పోషణ్ అభియాన్ ద్వారా 6 నెలల నుంచి 3 ఏండ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గిస్తామని తెలిపింది. రూ. 45 వేల కోట్ల విలువైన ఆహార ధాన్యాలు, రూ.54,061 కోట్ల నిధులను కేంద్రం సమకూర్చనుండగా, రాష్ర్టాల వాటాగా రూ.31,733 కోట్లు ఖర్చు చేస్తాయని వెల్లడించింది. కేంద్రం ఆహారధాన్యాలు, నిధులు కలిపి రూ.99,061 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, ఈ మూడేండ్లల్లో ఇప్పటి వరకు రూ.32.73 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కొత్త పథకం ప్రకటిస్తే ఏదో మంచి జరుగుతుందని అంతా ఆశిస్తారు. నిధులు వస్తాయనుకుంటారు. కానీ, కొత్త పథకం పేరుతో నిధులకు కోత పెట్టింది.. మోదీ ప్రభుత్వం. పథకం పేరును మార్చి, జనాన్ని ఏమార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది అనటానికి ఇదో ఉదాహరణ.
తగ్గింపులే.. పెంచింది లేదు
మధ్యాహ్న భోజనం, పీఎం పోషణ్ అభియాన్.. పథకమేదైనా కేంద్రం ఏటా కోతలు, వాతలు పెడుతున్నది. ఏటికేడు బడ్జెట్లో కోతలు విధిస్తున్నది. 2014-15లో ఈ పథకం కోసం రూ.13,215 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.10 వేల కోట్లకే పరిమితం చేసింది. పైగా కేటాయించిన నిధులనూ విడుదల చేయలేదు. ఏటా బడ్జెట్లో పొందుపర్చడం, అంచనాలను సవరించి మరికొంత పెంచడం జరుగుతూ ఉంటుంది. కానీ, ప్రతిపాదించిన నిధులనూ కేంద్రం విడుదల చేయలేదు. 2021-22కి రూ.11,500 కోట్లు కేటాయించిన కేంద్రం.. రూ.2,708 కోట్లు (23 శాతం) మాత్రమే విడుదల చేసింది.