హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ) దేశంలోనే అగ్రస్థానానికి చేరుకొన్నది. ఆరేండ్ల కాలంలోనే ఈ ఘనత సాధించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వెల్లడించిన నివేదికలో 7,219 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తితో (91.15 పీఎల్ఎఫ్) ఎస్టీపీపీ ప్రథమ స్థానంలో నిలిచింది. కరోనా సమయంలో మినహా, అన్ని సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఎస్టీపీపీ అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) సాధించింది. అంతేకాదు..
ఈ ఆర్థిక సంవత్సరంలో గత నవంబర్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న 250 కిపైగా థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో అన్నింటికన్నా ఎక్కువ పీఎల్ఎఫ్ను ఎస్టీపీపీనే సాధించింది. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలైన ఎన్టీపీసీ, అదానీ, టాటా, రిలయన్స్, జిందాల్ తదితర సంస్థలన్నింటినీ ఎస్టీపీపీ వెనక్కి నెట్టింది. ఈ నేపథ్యంలో సంస్థ ఉద్యోగులను సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అభినందించారు. తెలంగాణ విద్యుత్తు అవసరాలు తీర్చడంలో సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం తన వంతు పాత్రను పోషిస్తున్నది. తెలంగాణ వినియోగిస్తున్న మొత్తం విద్యుత్తులో 12 శాతం ఎస్టీపీపీనే సమకూర్చుతున్నది. సింగరేణి ఏటా సగటున రూ.400 కోట్లకుపైగా లాభాలను ఆర్జిస్తున్నది.
మార్చి నుంచి మూడో ప్లాంట్ పనులు
తెలంగాణకు విద్యుత్తును అందించటంలో సొంత ప్లాంట్ల ప్రాధాన్యాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ సింగరేణి ఆధ్వర్యంలో మూడో ప్లాంట్ నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. దీనితో 800 మెగావాట్ల మూడో ప్లాంట్ను ప్రస్తుతం రెండు యూనిట్లు (1,200 మెగావాట్లు) ఉన్న ప్రాంగణంలోనే నిర్మాణానికి సమగ్ర ప్రణాళికను రూపొందించారు. ఈ నెలలో టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తారు. మార్చి నుంచి నిర్మాణ పనులను ప్రారంభించాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశించారు.