హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఏదైనా స్కీంలోనో.. ప్రాజెక్టులోనో.. ఇంకెక్కడైనా స్కాం జరిగిందంటే.. దాని వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు అర్థం. రాష్ట్రం సేకరించిన ధాన్యంలో ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన సీఎమ్మార్ (కస్టమ్ మిల్డ్ రైస్) లో స్కాం జరిగిందని విపక్షాల నేతలు బండి సంజయ్, రేవంత్రెడ్డి నోరు పారేసుకుం టున్నారు. వీరిద్దరికీ సీఎమ్మార్ అంటే కనీస అవగాహన ఉన్నదా? స్కాం జరగటానికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుందన్న ఇంగితమైనా ఉన్నదా? అని విమర్శలు వస్తున్నాయి.
రైతుల నుంచి సేకరించిన ధాన్యం మిల్లర్లకు ఏవిధంగా చేరుతుంది? మిల్లర్లు సీఎమ్మార్ను ఎఫ్సీఐకి ఏ విధంగా ఇస్తారు? పౌరసరఫరాల శాఖకు ఎఫ్సీఐ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తుంది? అన్న విషయాలపై ఇసుమంతైనా తెలిసి ఉండకపోవడం విడ్డూరం. అంశం ఏదైనా సరే.. తమకు తెలిసినా.. తెలియకపోయినా సరే.. బట్టకాల్చి మీద పారేస్తే పాయె.. అన్నది ఈ ఇద్దరు నేతలు ఆచరిస్తున్న రాజకీయం. ముందైతే ఆరోపణలు చేయాలె.. అది తప్పని తెలిసేలోగా.. జనంలోకి తమ అబద్ధాలు పోవాలె.. తీరా తప్పని తేలితే.. గమ్మున ఉండాలె.. వేరే అంశంవైపు తల తిప్పాలె.. ఇదేరీతిలో కొన్నాళ్లుగా రైతుల సంక్షేమం కోసం పరితపిస్తున్న ప్రభుత్వంపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తద్వారా రాజకీయ లబ్ధిపొందేందుకు కుట్రలు పన్నుతున్నారు. తాజాగా సీఎమ్మార్పై బట్ట కాల్చిపారేశారు.
బియ్యం ఇస్తే గానీ.. డబ్బులు రావు
ఏ వస్తువు కొనుగోలు విషయంలో అయినా సరే.. ముందుగా డబ్బులు చెల్లిస్తే అవకతవకలకు అవకాశం ఉంటుంది. లేదంటే కొనుగోలు చేసే వస్తువు విలువ కన్నా ఎక్కువ చెల్లిస్తే అవకాశం ఉంటుంది. ఎఫ్సీఐకి సీఎమ్మార్ ఇవ్వడంలో ఈ రెండూ జరుగవు. అటువంటప్పుడు అవకతవకలకు, కుంభకోణాలకు అవకాశం ఎక్కడ? ప్రభుత్వానికి గానీ, పౌరసరఫరాలశాఖకు కానీ, మిల్లర్లకు గానీ ఎఫ్సీఐ ముందస్తు అడ్వాన్స్లు ఇవ్వదు. పౌరసరఫరాల సంస్థ తరుపున మిల్లర్లు ఎఫ్సీఐకి బియ్యం సరఫరా చేసిన తర్వాతే అందుకు సంబంధించిన డబ్బులను ఎఫ్సీఐ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు చెల్లిస్తుంది. బియ్యం ఇయ్యని పక్షంలో రూపాయి కూడా ఇవ్వదు. బియ్యం ఎఫ్సీఐ గోదాముల్లోకి చేరిన తర్వాత బిల్లు పెడితే గానీ డబ్బులు చెల్లించదు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎమ్మార్లో స్కాంలకు చాన్స్ ఎక్కడుంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
లక్ష టన్నులు ఆలస్యం.. డబ్బులివ్వని ఎఫ్సీఐ
2019-20 యాసంగి సీజన్లో ప్రభుత్వం 64.17 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఎఫ్సీఐకి 43.59 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉన్నది. సీఎమ్మార్ ఇవ్వాల్సిన గడువు ముగియడంతో 103 మిల్లులకు సంబంధించి లక్ష టన్నుల బియ్యం తీసుకొనేందుకు ఎఫ్సీఐ నిరాకరించింది. ఈ బియ్యం ఎఫ్సీఐకి అప్పగిస్తే టన్నుకు రూ.32 వేల చొప్పున మొత్తం రూ.320 కోట్లు సివిల్ సైప్లెకి వచ్చేవి. కానీ ఆ డబ్బులు ఎఫ్సీఐ ఇవ్వలేదు. గడువు పొడిగించేందుకు అంగీకరించలేదు. పౌరసరఫరాల సంస్థకు జరిగిన నష్టాన్ని ఆ శాఖ మిల్లర్ల నుంచి వసూలుచేసింది. పౌరసరఫరాల సంస్థ సీఎమ్మార్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం అడ్డగోలుగా అసత్య ఆరోపణలు చేస్తుండటం విడ్డూరం.
ఇదీ సీఎమ్మార్ అందించే ప్రక్రియ..
ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర
ఎఫ్సీఐకి సీఎమ్మార్ అందజేతలో ఎలాంటి స్కాం లేదు. స్కాం జరగడానికి ఎఫ్సీఐ ఏమైనా ముందుగా డబ్బులు చెల్లిస్తుందా? ప్రభుత్వం టార్గెట్ కన్నా తక్కువ బియ్యం ఇచ్చినా ఎఫ్సీఐ ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నదా? మరి స్కాం ఎలా జరుగుతుంది. ఎఫ్సీఐకి బియ్యం చేరే వరకు అవి ప్రభుత్వానికి సంబంధించినవే.. ఎఫ్సీఐకి ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వమే రైతులకు డబ్బులిచ్చి ధాన్యం కొంటుంది. ఇవేవి తెలియని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కుట్ర చేస్తున్నారు. ప్రజలను తప్పుతోవ పట్టించే యత్నం చేస్తున్నారు.
– గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి