సిర్పూర్(టీ), జూన్ 4 : బుద్ధుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన సూచనలు పాటించాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని నాగమ్మ చెరువు వద్ద ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సొంత నిధులతో ఏర్పాటు చేసిన 32 అడుగుల ఏకశిల గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వర్రావు, ఆంధ్రప్రదేశ్లోని దెందుళూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిలతో కలిసి మంత్రి కొప్పుల ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు శాంతికి చిహ్నమని పేర్కొన్నారు. అంతకుముందు సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్ నుంచి నాగమ్మ చెరువు వరకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. దాదాపు 50 మంది బౌద్ధ భిక్షువులు, బంతిజీలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ బోర్కుడే సహదేవ్రావు, ఎస్పీ కే సురేశ్కుమార్ పాల్గొన్నారు.