15 రోజుల్లోనే ప్రారంభం
సాంఘిక సంక్షేమశాఖ ముమ్మర కసరత్తు
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 11సర్కిళ్లు
అభ్యర్థులకు ఉచిత శిక్షణ, వసతి
హైదరాబాద్, ఏప్రిల్ 4 : వివిధ శాఖల్లోని 80 వేలకుపైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్టు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగార్థులకు అండగా నిలబడే దిశగా సాంఘిక సంక్షేమ శాఖ ముమ్మర కసరత్తును ప్రారంభించింది. నిరుపేద దళిత ఉద్యోగార్థుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలోనూ స్టడీ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శిక్షణకు, వసతికి సుమారు రూ.లక్ష దాకా ఖర్చయ్యే నేపథ్యంలో దళిత అభ్యర్థులు చాలా మంది పట్టణాలకు రాలేని దుస్థితి. దీనిని దృష్టిలో పెట్టుకుని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లా కేంద్రానికి ఒక ఎస్సీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరో 15 రోజుల్లో అన్ని చోట్ల నూతన స్టడీ సర్కిళ్లను ప్రారంభించాలని ముమ్మర సన్నాహాలు చేస్తున్నది. ప్రతి దళిత అభ్యర్థికి ఉచిత శిక్షణ అందించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నది.
ప్రస్తుతం హైదరాబాద్ మినహాయించి ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున మొత్తంగా 11 ఎస్సీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వాటి ద్వారా దళిత ఉద్యోగార్థులకు ఉచితంగా మెరుగైన శిక్షణను ప్రభుత్వం అందిస్తున్నది. ఆయా స్టడీ సర్కిళ్లలో అత్యాధునిక వసతులు కల్పించింది. యువతీ యువకులకు వేర్వేరుగా హాస్టల్ వసతిని కల్పించడంతో పాటు నిపుణులతో తర్ఫీదు ఇప్పిస్తున్నారు. స్టడీ సర్కిళ్లలో ప్రత్యేకంగా గ్రంథాలయాలను నెలకొల్పుతుండడమే గాక, ఉద్యోగార్థులు ఏ పుస్తకం కోరినా సంబంధిత అధికారులు వెంటనే వారికి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2, రైల్వే, పోస్టల్, డీఎస్సీతోపాటు ఇతర అన్ని పోటీపరీక్షలకు సంబంధించిన పుస్తకాలను, నోట్స్ను, ఇంజినీరింగ్ విద్యార్థులకు సంబంధించిన సామగ్రిని సమకూరుస్తున్నారు. అవసరమైన స్టడీ మెటీరియల్ను తక్కువ ధరకే జిరాక్స్ తీసి ఇస్తున్నారు. కావాలంటే పెన్డ్రైవ్లలో కూడా వేసి ఇస్తున్నారు. అదేవిధంగా స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందే ఉద్యోగార్థులకు పుస్తకాల కొనుగోలుకు ప్రత్యేకంగా గ్రాంట్ను అందిస్తున్నారు. కంప్యూటర్లను అందుబాటులో ఉంచారు.
సద్వినియోగం చేసుకోవాలి
భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాల ప్రక్రియను సీఎం కేసీఆర్ చేపట్టారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పోటీ పరీక్షల తర్ఫీదు కోసం ఎవరూ.. ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఫీజులు కట్టాల్సిన అవసరమే లేదు. సీఎం మార్గనిర్దేశాల మేరకు స్టడీ సెంటర్లను త్వరలోనే ప్రారంభిస్తాం. ఉద్యోగార్థులకు అండగా నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేశాం.
– కొప్పుల ఈశ్వర్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి