హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : కంచ గచ్చిబౌలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, బాధ్యత గల ప్రభుత్వం, కావాలనే సెలవు దినాల్లో బుల్డోజర్లతో విధ్వంసానికి పాల్పడటంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ సర్కారుకు చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైనదో సుప్రీంకోర్టులో జరిగిన వాదనలతో ప్రపంచానికి తేటతెల్లమైందని బుధవారం ఎక్స్ వేదికగా తెలిపారు. విధ్వంసం చేసిన వందల ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని నిలదీయడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. అధికారం ఉన్నది కదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తే సభ్య సమాజం, న్యాయ వ్యవస్థలు చూస్తూ ఊరుకోబోవని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకొస్తాయని వివరించారు. విధ్వంసమే విధానంగా రేవంత్రెడ్డి నిరంకుశ పాలన సాగుతున్నదని మండిపడ్డారు. హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చి అరాచకం చేశారని, బుల్డోజర్లతో పర్యావరణ హననం చేశారని దుయ్యబట్టారు. తమకు న్యాయస్థానాల మీద ఎంతో గౌరవం ఉన్నదని వెల్లడించారు. అందుకే బాధ్యతగా బీఆర్ఎస్ తరఫున సాధికార కమిటీకి నివేదిక ఇచ్చామని చెప్పారు. వృక్షో రక్షతి రక్షితః అని పెద్దలంటే, వృక్షో భక్షతి అన్నట్టుగా తయారైన సీఎం రేవంత్రెడ్డికి బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.