ధర్మపురి, నవంబర్ 6: తెలంగాణ దేశానికి ధాన్య భాండాగారంగా మారిందని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్నదాతల మేలు కోసమే ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు నిర్ణీత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.
ఆదివారం ఆయన జగిత్యాల జిల్లా ధర్మపురిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ మోదీ సర్కారు వడ్లు కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతులపై కక్షగట్టిందని విమర్శించారు. కేంద్ర మంత్రులు ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్తూ.. నూకలు తినాలని వెటకారమాడుతున్నారని మండిపడ్డారు.