హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులను ఇతర రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టులో ఇద్దరిని, మద్రాస్ హైకోర్టు నుంచి మరో ఇద్దరు మొత్తం ఏడుగురిని బదిలీ చేయాలని గురువారం సిఫారసు చేసింది. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఏ అభిషేక్రెడ్డిని పాట్నా హైకోర్టుకు, జస్టిస్ డీ నాగార్జున్ను మద్రాస్ హైకోర్టుకు, ఏపీ నుంచి గతేడాది నవంబర్ 15న బదిలీపై ఇకడికి వచ్చిన జస్టిస్ కన్నెగంటి లలితను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది.
ఏపీ హైకోర్టులోని జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డీ రమేశ్ను మద్రాస్, అలహాబాద్ హైకోర్టులకు, మద్రాస్ హైకోర్టులో పనిచేసే జస్టిస్ వీఎం వేలుమణి, జస్టిస్ టీ రాజాలను కలకత్తా, రాజస్థాన్ హైకోర్టులకు బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించింది. వీటికి కేంద్రం సమ్మతి తెలియజేస్తే రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. ఈ బదిలీలకు రాజముద్ర పడితే తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య (సీజేతో కలిపి) 33 నుంచి 30కి తగ్గుతుంది. మరో 12 పోస్టులు ఖాళీగా ఉంటాయి.