హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్నది. మరీ ముఖ్యంగా అమ్మాయిల నమోదులో అద్భుత పురోగతి కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటుచేసి అమ్మాయిల చదువుకు భరోసా కల్పిస్తున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వారికి నవపథాన్ని చూపుతున్నది. దీంతో అవకాశాలను అందిపుచ్చుకొంటున్న అమ్మాయిలు ఉన్నతవిద్యలో దూసుకుపోతున్నారు. గత నాలుగేండ్ల ఆలిండియా సర్వే అన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ వివరాలను పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అబ్బాయి నమోదుతో పోల్చితే అమ్మాయిల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో నాలుగేండ్లుగా పురోగతి దిశలో సాగుతున్నది. కోర్సుల వారీగానమోదు కూడా ఏటేటా పెరుగుతున్నది. రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకులాలుండగా, పదోతరగతి వరకున్న గురుకులాలను క్రమంగా ఇంటర్, డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేస్తున్నారు. దీంతో పదో తరగతి పూర్తిచేసిన అమ్మాయిలు, ఇంటర్ పూర్తిచేస్తున్నారు. కాలంతో పోటీపడే స్థాయికి చేరి.. సొంత నిర్ణయాలు తీసుకొనే స్థాయికి ఎదుగుతున్నారు. తల్లిదండ్రులు వివాహాలు చేస్తామంటే కాదంటూ.. చదువులకే జై కొడుతున్నారు. దీంతో ఉన్నత విద్యలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ప్రగతిపథాన సాగుతున్నారు.
సామాజికవర్గాల వారీగా తీసుకొంటే రాష్ట్రంలో ఎస్సీ అబ్బాయిల ఎన్రోల్మెంట్ 2016-17లో 32.8శాతం ఉండగా, 2020-21కి వచ్చేసరికి 31.8 శాతానికి చేరింది. అంటే వీరి నమోదు 1శాతం తగ్గింది. అమ్మాయిల ఎన్రోల్మెంట్ 2016-17లో 33.0శాతం ఉంటే 2020 -21కి వచ్చేసరికి 39.3శాతానికి చేరింది. అంటే 6 శాతం పెరిగింది.
ఎస్టీ అబ్బాయిల నమోదు 2016-17లో 34.9 శాతముంటే, 2020 -21కి వచ్చేసరికి 34.2శాతానికి చేరి 0.7శాతం తగ్గింది. అమ్మాయిల నమోదు 28.2 శాతం నుంచి 33.3శాతానికి పెరిగింది. అంటే 5 శాతం పెరిగింది.
కోర్సుల్లో చేరే వారి సంఖ్య కూడా రాష్ట్రంలో కొంతకాలంగా పెరుగుతూ వస్తున్నది. 2016-17లో పీహెచ్డీలో 4,200 మంది విద్యార్థులు మాత్రమే చేరగా, 2020-21కి వచ్చేసరికి 6,715 మంది విద్యార్థులు పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు.
2016-17లో 11.06 లక్షల మంది మాత్రమే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందగా, 2020 -21కి వచ్చేసరికి వారి సంఖ్య 12.51 లక్షలకు చేరింది.