లండన్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడే విధానం చిల్లర రాజకీయాలను తలపిస్తుందని ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే కార్యదర్శి సతీష్ రెడ్డి గొట్టెముక్కల అన్నారు. ‘యూకే ప్రవాస సంఘాలు’ (London) ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నారైలను ఉద్దేశించి మాట్లాడిన తీరు గల్లీ కాంగ్రెస్ మీటింగ్లో మాట్లాడినట్టు ఉందని ఎన్నారైలు(NRI) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
రాజకీయాలకతీతంగా ప్రసంగించాల్సిన సీఎం, బీఆర్ఎస్ను బొంద పెడుతామని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. గతంలో లండన్కి వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ ఎంతో హుందాగా ప్రసంగించి ఎన్నారైలల్లో ఎంతో స్ఫూర్తి నింపారన్నారు. కానీ, నేడు సీఎం హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి వేదిక ఏంటనే సోయి లేకుండా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో మాట్లాడినట్టు ప్రసంగించి తెలంగాణ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాలు ఎప్పుడూ ఉండేవని కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా గల్లీ కార్యకర్తలా మాట్లాడడం మానుకొని సందర్భానుసారంగా ప్రవర్తిస్తే తనకు, తెలంగాణ గౌరవానికి మంచిదని హితవు పలికారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని లేకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు.