మహబూబాబాద్ : కేసీఆర్తోనే రైతులకు స్వర్ణయుగం అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(
Sathyavathi Rathod) అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన పదేళ్లలో కేసీఆర్ రైతును రాజు చేశారని, వ్యవసాయం పండుగ చేశారన్నారు. కేసీఆర్ హయాంలో(KCR rule) రైతులకు రైతు బంధు, సమయానికి రైతులకు విత్తనాలు ఎరువులు అందించారని చెప్పారు. మే, జూన్ నెలల్లో 45, 50 అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా ప్రజలు ఎవరూ బిందెలు పట్టుకుని రాలేదని తెలిపారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతులకు కరువు తెచ్చిందని పేర్కొన్నారు. రాజకీయాలు ఎన్నికలు ఉన్నపుడే మాత్రమే చేయాలని, రైతుల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటోందని విమర్శంచారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం 2000 మంది రైతులతో డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలో ఒక రోజు దీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఈ దీక్షలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు.