హైదరాబాద్, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ)/ సిటీబ్యూరో : సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతిని ప్రతి ఏటా అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఆగస్టు 18న, వర్ధంతిని ఏప్రిల్ 2న నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జీవో విడుదలపై హర్షం
సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల వేములయ్య గౌడ్, తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు, మంత్రి శ్రీనివాస్గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. భారత మాత ముద్దు బిడ్డగా, తెలుగు తొలి బహుజన చక్రవర్తిగా 21 కోటలు నిర్మించి, 30 ఏండ్లు పాలించి, ఏడున్నర నెలల పాటు గోల్కొండను ఏలిన పోరాట యోధుడు సర్వాయి పాపన్న అని కూరెళ్ల కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం గౌడ్ల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పల్లె లక్ష్మణ్రావు చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో గౌడ్ల ఓట్లన్నీ టీఆర్ఎస్కే అని తెలిపారు. జీవో విడుదల పట్ల తెలంగాణ గౌడ్ సంఘం ప్రధాన కార్యదర్శి, నవాబుపేట మారెట్ కమిటీ చైర్మన్ జీ ప్రశాంత్గౌడ్, ఉపాధ్యక్షుడు సంజయ్గౌడ్, గౌడ్ కంఠమ్ మాస పత్రిక ఎడిటర్ నోముల సిద్ధూగౌడ్ సంతోషం వ్యక్తంచేశారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్ హర్షం
సర్వాయి పాపన్నగౌడ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మూడు వందల ఏండ్ల క్రితమే వెనుకబడిన వర్గాల పక్షాన పోరాడిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. మొఘల్ చక్రవర్తుల అరాచక పాలనను ఎదురించి నిలిచిన ధీరుడు అని పేర్కొన్నారు.