హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు చేర్చాక తాలు పేరుతో తరుగు తీయడం చట్టవిరుద్ధమని, అలా కోత విధించే మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ హెచ్చరించారు. తేమ, తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రొక్యూర్మెంట్, మారెటింగ్, ఫైనాన్స్ అధికారులతో బుధవారం సమీక్షించారు.
ఈ సందర్భంగా రవీందర్సింగ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల సంస్థ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కూడిన 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విజిలెన్స్ బృందాలు ప్రధానంగా క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాల్లో కొనుగోలు చేసిన ధాన్యం, ఓపీఎంఎస్ నమోదు, రెండింటికీ మధ్య ఉన్న వ్యత్యాసాలు, ఓపీఎంఎస్ నమోదులో ఎదురవుతున్న సమస్యలు, జాప్యానికి గల కారణాలను పరిష్కరిస్తాయని తెలిపారు.
కొనుగోలు చేసిన ధాన్యంలో ఎంతమేరకు మిల్లులకు తరలించారు, ఏయే మిల్లుల్లో మిల్లర్ అక్నాలెడ్జ్ సమస్య ఉంది, ఆ సమస్య ఉన్న మిల్లులను విధిగా పరిశీలించడం, చెల్లింపుల జాప్యానికి గల కారణాలపై విశ్లేషణ, చెల్లింపులను వేగవంతం చేయడానికి చేపడుతున్న చర్యలను ఈ బృందా లు సమీక్షిస్తాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల తరుగు సమస్య వస్తుందన్న ఫిర్యాదులపై ఇప్పటికే జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకున్నట్టు చెప్పారు. అధికారుల అలసత్వం వల్ల రైతులు ఇబ్బందులకు గురైతే కఠిన చర్యలు తీసుకోవడానికి ఎంతమాత్రంం వెనుకాడబోమని చెప్పారు.
దించుకున్న ధాన్యానికి మిల్లర్ అక్నాలెడ్జ్ ఇవ్వకుండా జాప్యం చేస్తే దీనికి జిల్లా మేనేజరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. నిబంధనల ప్రకారం ప్రతి కొనుగోలు కేంద్రం లో రైస్మిల్లర్ ప్రతినిధి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 7,183 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 4.03 లక్షల మంది రైతు ల నుంచి 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వివరించారు. నిరుడు ఇదే సమయానికి 18.58 టన్నులు కొనుగోలు చేసినట్టు తెలిపారు.