హైదరాబాద్ : కొత్త సంవత్సరం తొలిరోజున తీసుకునే భవిష్యత్ నిర్ణయాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా భాగం కల్పించాలని “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం మొక్కను నాటారు. ఆయన మాట్లాడుతూ మొక్కలు మానవ జీవితాలకు ప్రాణవాయువును ఇచ్చి మనం వదిలిన కార్బన్ డయాక్సైడ్ ను తీసుకొని నేలను కాపాడుతున్నాయని అన్నారు.
గ్లోబల్ వార్మింగ్, ఆకస్మిక వాతావరణ మార్పులకు అడ్డుకట్టపడాలంటే మొక్కలు నాటడం ఒక్కటే శరణ్యమని వివరించారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటేలా ప్రతిజ్ఞ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, వెంకట్ నారాయణ, బి. వేణుగోపాల్, టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ రాకేశ్, చీటీ రామారావు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” బాధ్యులు రాఘవ తదితరులు పాల్గొన్నారు.