హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో సంక్రాంతి సెలవుల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించవద్దని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా హెచ్చరించారు. ఈ నెల 13 నుంచి 16 వరకు సెలవులుగా పాటించాలని, తిరిగి కళాశాలలు 17న పున:ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల జూనియర్ కళాశాలలు ఈ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఆయా రోజుల్లో తరగతులు నిర్వహిస్తే తీవ్రం గా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా లేఖలు రాశారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఈ పరీక్షల నిర్వహణకు సీఎస్డీవోలు, స్కాడ్, పోలీసు, రవాణా, పోస్టల్ సిబ్బంది నియామకాలు సహా ఇతర అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.