TSRTC | హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): పండుగ వేళ ప్రజలు ఆర్టీసీకి బ్రహ్మరథం పడుతున్నారు. సొంత వాహనాల కన్నా ఆర్టీసీ ప్రయాణానికే మొగ్గు చూపుతుండటంతో రికార్డు స్థాయి ఆక్యుపెన్సీ నమోదవుతున్నది. శనివారం ఒకరోజే 52.78 లక్షల మందిని ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. ఇందులో సగానికిపైగా మహిళలే. వీరంతా మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని ఉచితంగా సొంతూళ్లకు వెళ్లినట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా 4,484 ప్రత్యేక బస్సులను నడుపాలని ఆర్టీసీ ప్రణాళికలు రచించింది. అంచనాలకు మించి ప్రయాణికుల రద్దీ ఉండటంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లోనే 4,400 ప్రత్యేక బస్సులను నడిపినట్టు వెల్లడించారు. శనివారం వరకు మొత్తం 6,261 ప్రత్యేక బస్సులను నడిపినట్టు చెప్పారు.
అంచనా కన్నా 1,777 బస్సులను అధికంగా నడిపినట్టు వివరించారు. రికార్డుస్థాయిలో శనివారం ఒక్కరోజే 1,861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు నడిపినట్టు తెలిపారు. హైదరాబాద్ సిటీలో నడిచే 1,127 బస్సులను ప్రయాణికుల రద్దీ ఎకువగా ఉన్న కరీంనగర్, వరంగల్, విజయవాడ, ఖమ్మం, తదితర రూట్లలో తిప్పినట్టు చెప్పారు. ఆదివారం కూడా 652 ప్రత్యేక బస్సులు నడిపామని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళికతోపాటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంక్రాంతికి ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా సొంతూళ్లకు చేర్చామని తెలిపారు. తొలిసారిగా బస్భవన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. సంక్రాంతికి ప్రశాంతంగా ప్రజలను సొంతూళ్లకు చేర్చడంలో పాలుపంచుకున్న టీఎస్ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.