జనగామ రూరల్, ఫిబ్రవరి 24 : దేశంలో స్వచ్ఛభారత్ వంటి పథకాలను అమలు చేస్తూ ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. నిత్యం గ్రామాలు, పట్టణాలను శుభ్రం చేస్తూ స్వచ్ఛ గ్రామాలు, పట్టణాలుగా తీర్చిదిద్దుతున్న పారిశుధ్య కార్మికులను పట్టించుకోవడం లేదని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. శనివారం ఆయన జనగామ జిల్లాకేంద్రంలోని చౌరస్తాలో పారిశుధ్య కార్మకులతో కలిసి చెత్తను ఊడ్చారు. ఈ సందర్శంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస గుర్తింపును ఇవ్వడం లేదని ఆరోపించారు.
ఈ రంగంలో 90 శాతం మంది మాదిగలు ఉండటంతో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఏండ్ల తరబడి ఎలాంటి భద్రత లేకుండా పని చేసినా పర్మినెంట్ చేయకపోవడం బాధాకరమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.