Tungabhadra | అలంపూర్, జనవరి 1: తెలంగాణ-ఏపీ సరిహద్దులో పారుతున్న తుంగభద్ర నదికి రెండు వైపులా ఉన్న ప్రాంతాల అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో యథేచ్ఛగా నది నుంచి ఇసుకను తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాఫియా తుంగభద్ర నదిలో రాత్రిళ్లు ఇసుకను తోడేస్తూ.. పగలు ఎత్తేస్తూ దర్జాగా దందా నిర్వహిస్తున్నది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం సింగవరం సమీపంలోని తుంగభద్ర నదికి సమీపంలో అవతలి వైపు ఏపీలోని పూడూరు, దేవమాడ, కోళ్ల బాంపురం గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ రెండు రాష్ర్టాల అధికారుల అలసత్వం కారణంగా తనిఖీలు తక్కువగా ఉంటున్నాయి. దీంతో ఇసుక మాఫియా ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. నదిలో ఉభయ రాష్ర్టాలకు సగం, సగం వాటా ఉన్నది. అయితే ఏపీలోని కర్నూల్ ప్రాంతానికి చెందినవారు ఆ రాష్ట్ర సరిహద్దులో ఉన్న వారి వాటాను తరలించుకుపోవడం పూర్తికాగా.. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణ వాటా ఇసుకను కూడా తోడేస్తున్నారు. మన ప్రాంతంలోకి వచ్చి ఇసుకను రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. దేవమాడ, కోళ్ల బాంపురంతోపాటు నందికొట్కూర్ సమీపంలో రాత్రయితే చాలు నిత్యం 30 నుంచి 50 వరకు ట్రాక్టర్లతో ఇసుకను దోచుకెళ్తున్నారు. రాత్రి 10 దాటితే చాలు నదిలో ఇసుక దొంగలు విజృంభిస్తున్నారు. తెల్లవారుజాము 4, 5 గంటల వరకు నిరంతరాయంగా ఇసుక తరలిస్తున్నారు.
తగ్గిపోతున్న భూగర్భ జలాలు
తుంగభద్ర నదిలో యథేచ్ఛగా ఇసుకను తోడేస్తుండడంతో తీర ప్రాంతంలో భూగర్భ జలాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఇప్పటికే బోర్లలో నీటిమట్టం గణనీయంగా తగ్గిందని రైతులు వాపోతున్నారు. దీంతో రైతులు ఇసుక తరలింపుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నది నుంచి ఇసుక తరలించే ప్రాంతం సింగవరం గ్రామానికి 2 కిలోమీటర్లు.. అలంపూర్ పోలీస్స్టేషన్కు 5 కిలోమీటర్ల దూరం ఉండటంతో పోలీసులు నిఘా ఉంచలేకపోతున్నారు. తరలింపునకు సంబంధించి ఏమైనా సమాచారం అందితే పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ఇసుకాసురులు అక్కడి నుంచి జారుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తరలిస్తుండటంతో వ్యాపారం ‘మూడు ట్రాక్టర్లు.. ఆరు ట్రిప్పులు’గా వర్ధిల్లుతున్నది.
ధ్వంసమవుతున్న రైతుల పైపులు
తుంగభద్ర నదిలో నీటిని పంట పొలాలకు తరలించేందుకు పలు గ్రామాల రైతులు పొలాల వద్దకు పైపులు వేసుకున్నారు. అయితే రాత్రిళ్లు ఇసుక రవాణా సమయంలో ఇసుకలోని పైపులను సైతం ధ్వంసం చేస్తున్నారు. మరికొందరైతే బయటపడిన పైపులను ఎత్తుకెళ్తున్నారని రైతులు లబోదిబోమంటున్నారు. ఆరుగాలం కష్టపడి వేసిన పంటలకు సాగునీరు పారించేందుకు ఏర్పాటు చేసిన పైపులను తీసుకెళ్లడంతో తమకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు. గతంలో ఇలా పైపులను ధ్వంసం చేసిన ఇసుకాసురులను సింగవరం రైతులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అయినా వారితీరులో ఏమాత్రం మార్పు రాలేదు. ఈసారి ఇసుక తరలింపుతో నదిలో నీటి ప్రవాహం తగ్గిపోయిందని పలువురు రైతులు విచారం వ్యక్తంచేస్తున్నారు.
ఇసుకపై మాఫియా కన్ను
నదీ తీర గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నది. రాయలసీమకు చెందిన మాఫియా రాత్రయితే చాలు నదిలో ఇసుక తోడివేతకు పాల్పడుతున్నది. అక్కడి నుంచి సమీపంలోని గ్రామాల శివారుకు తరలించి డంప్ చేస్తున్నది. పగటి సమయంలో అక్కడి నుంచి కర్నూల్, నందికొట్కూరు, ఆత్మకూరు, ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నది. రాత్రి వేళలో నదిలో విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నా రెండు రాష్ర్టాల అధికారులు దృష్టిసారించడం లేదని పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇసుక తరలిస్తే కఠిన చర్యలు: ఎస్సై రమేశ్, అలంపూర్
సింగవరం గ్రామ శివారులో తుంగభద్ర నది నుంచి ఇసుక తరలించే ప్రాంతం ఇంటీరియల్ ప్లేస్లో ఉన్నది. గతంలో ఇక్కడి నుంచి ఇసుక తరలింపు కొనసాగింది. ప్రస్తుతం ఆ ప్రాంతంపై ప్రత్యేక నిఘా పెంచాం. గతంలో దాడులు చేయగా మాఫియా లీడర్లు తప్పించుకుపోయారు. ఎవరైనా అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం.