హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలను శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. తెలంగాణభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా కేసీఆర్ జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ఉద్యమసారథి, రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రపథంలో నిలిపిన కేసీఆర్ 69 ఏండ్లు పూర్తిచేసుకొని 70వ ఏటలో అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించే ఈ వేడుకలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయని, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొంటారని తెలిపారు.
ఆలయాలు, మసీదులు, చర్చిలలో పూజలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 1,000 మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.లక్ష విలువైన బీమా సదుపాయం, అందరికీ కలిపి రూ.10 కోట్ల విలువైన ప్రమా ద, ఆరగ్య బీమా పత్రాలను అందజేస్తామని బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ తెలిపారు. వికలాంగులకు వీల్చైర్లను పంపిణీ చేస్తామని, దవాఖానల్లో రోగులకు పండ్ల పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామని వివరించారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన, సాధించుకున్న రాష్ర్టాన్ని ఎలా అగ్రగామిగా నిలిపాడన్న కేసీఆర్ ఘనతను వివరిస్తూ ‘తానే ఒక చరిత్ర’ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీని ఈ వేడుకల సందర్భంగా ప్రదర్శిస్తామని తెలిపారు. ప్రత్యేకంగా తయారు చేయించిన 70 కిలోల కేక్ను పార్టీ కార్యాలయంలోనే కట్ చేస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్, పార్టీ నేతలు ఆశీశ్ కుమార్యాదవ్, గోసుల శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు.