Braille Ballot | హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): శాసనసభా సాధారణ ఎన్నికల్లో దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని ప్రోత్సహించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో 5.06 లక్షల దివ్యాంగుల ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించింది. వీరి కోసం ప్రత్యేకంగా 18వేల వీల్ చైర్లను కొనుగోలు చేశారు. ఇప్పటికే 3686 వీల్ చైర్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 21,686 వీల్ చైర్లు దివ్యాంగులకు అందుబాటులోకి తెచ్చారు.
ప్రతి పోలింగ్ ప్రదేశంలో కనీసం ఒక వీల్ చైర్ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటుగా వారికి అవసరమైన సహాయాన్ని అందించడానికి వాలంటీర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీరిని గుర్తించడానికి ప్రత్యేక రంగుతో టీ షర్ట్ అందిస్తున్నారు. వీరు దివ్యాంగులకు సహాయం చేస్తారు. పోలింగ్ కేంద్రంలో వికలాంగులకు క్యూ మార్గం ద్వారా కాకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసే వెసులుబాటు కల్పించారు. దివ్యాంగుల ఓటింగ్ శాతం పెరగాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంది.
దివ్యాంగులకు పోలింగ్ సౌకర్యాల ఏర్పాట్ల కోసం రాష్ట్ర స్థాయిలో దివ్యాంగుల సాధికారత శాఖ డైరెక్టర్ శైలజను నోడల్ అధికారిగా నియమించారు. జిల్లా స్థాయిలోనూ నోడల్ అధికారిని నియమించారు. పోలింగ్ రోజున వినికిడి లోపం ఉన్న ఓటర్లతో సంభాషించడానికి, గుర్తించిన కీలక సంకేతాలపై పిక్టోగ్రామ్ చార్ట్ తయారు చేసి పోలింగ్ యంత్రాంగానికి పంపిణి చేశారు. దివ్యాంగులకు ఉచితంగా రవాణా వసతి కల్పిస్తున్నారు.
కంటి చూపులేని ఓటర్ల కోసం బ్రెయిలీ లిపిలో ఓటరు స్లిప్పులను ప్రింట్ చేశారు. 76,532 ఓటరు స్లిప్పులను బ్రెయిలీ లిపి ప్రింట్ చేసి ఇచ్చారు. 40 వేల ఓటరు గైడ్ పుస్తకాలను తయారు చేశారు. 40 వేల డమ్మి బ్యాలెట్ పేపర్లను బ్రెయిలీ లిపిలో ప్రింట్ చేశారు. దీని ద్వారా కంటి చూపు లేని వారు వస్తే వారు ఓటు వేయడానికి అనువుగా ఈ బ్రెయిలీ లిపి డమ్మి బ్యాలెట్ పేపర్లు ఉపయోగపడనున్నాయి.
దృష్టి లోపం, వినికిడి లోపం, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లతో వ్యవహరించడానికి పోలింగ్ సిబ్బందికి ఉపయోగపడే సూచనలతో ఇంగ్లీషు, తెలుగులో ఓటింగ్ గురించి తెలియడానికి కరపత్రాలను ముద్రించారు. సిబ్బందికి కూడా దివ్యాంగుల ఓటు సౌకర్యాలు గురించి శిక్షణలో వివరించారు. వికలాంగులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా చైతన్య పర్చడానికి అన్ని జిల్లాలో వివిధ వర్గాల వికలాంగులతో అవగాహన ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో దివ్యాంగులకు చేస్తున్న ఏర్పాట్లపై ఇప్పటికే విస్త్రత ప్రచారం కల్పించారు. హోర్డింగ్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో ఓటర్లను ఆకర్షించడంలో భాగంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిలో భాగంగా దివ్యాంగులతోనే పోలింగ్ స్టేషన్లను నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా 120 పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల సిబ్బందే పనిచేస్తారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. కనీసం నియోజకవర్గానికి ఒక పోలింగ్ స్టేషన్ ఇలా దివ్యాంగులతో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు.