తాడ్వాయి, ఫిబ్రవరి 27 : మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన దశరథం (37) మంగళవారం మృతిచెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వరంగల్లోని దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల జరిగిన మేడారం మహాజాతరలో సమ్మక్క పూజారిగా దశరథం సేవలందించారు.
కొద్దిరోజుల క్రితం అతడి సోదరుడు సిద్దబోయిన లక్ష్మణ్రావు సైతం అనారోగ్యంతో మృతిచెందారు. ప్రస్తుతం దశరథం సైతం మరణించడంతో మేడారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూజారి దశరథం మృతి పట్ల మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.