జహీరాబాద్, జూన్ 25: బీజేపీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై జా తీయస్థాయిలో సీపీఐ పోరాటం చేస్తుందని, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్వహించిన ఆలిండియా తంజీమె ఇన్సాఫ్ మహాసభలకు హాజరై మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తుపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఆలిండియాలో బీజేపీ, బీజేపీ వ్యతిరేక కూటములు ఉన్నాయని, కాంగ్రెస్తోపాటు దేశంలోని 17 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పార్టీల పరిస్థితి మారే అవకాశం ఉన్నదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.