హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఒక హిట్లర్, ఒక ముస్సోలిని, ఫాసిజం, నాజీయిజం అన్ని కలబోసిన వ్యక్తి ప్రధాని మోదీ అని, అధికారం కోసం ఏమైనా చేసే ఔరంగజేబు ఆయనలో దాగి ఉన్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చి, శాశ్వత నియంతగా మారాలని మోదీ భావిస్తున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి కుర్చీలో కొనసాగేందుకు ఏమైనా చేసేందుకు మోదీ వెనుకాడటం లేదని దుయ్యబట్టారు.
హైదరాబాద్లో రెండురోజులపాటు జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల ముగింపు సందర్భంగా శుక్రవారం మగ్ధూం భవన్లో ఆయన పలువురు పార్టీ నేతలతో మీడియాతో మాట్లాడారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిని బయట వదిలేసి.. వంద కోట్ల వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడం ద్వారా ప్రధాని మోదీ తన ప్రత్యర్థుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు.