CM KCR | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): చిరుద్యోగులు..! వారు లేనిదే కార్యాలయాలు పనిచేయవు. ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగవు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, టెంపరరీ అంటూ రకరకాల పేర్లు. అరకొర వేతనాలు. అనునిత్యం అభద్రత. పొద్దస్తమానం బండెడు చాకిరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఇదే దుస్థితి. స్వరాష్ట్రం సాధించుకున్నాక.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో చిరుద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరించాయి. వేతనాల్లో అనూహ్య వృద్ధి సాధ్యమైంది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగాయి. ఒక్కో క్యాటగిరిలో 40 నుంచి 76% మేర వేతనాలు పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం వేతనాలు పెంచడమే కాకుండా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం పీఆర్సీని వర్తింపజేసింది. అడుగకుండానే అక్కున చేర్చకున్నది. వారి సేవలను గుర్తించి గౌరవించింది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ 5,544 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించగా, సఫాయి కార్మికుల వేతనాలను రూ.వెయ్యి పెంచుతున్నట్టు ప్రకటించారు.
పెద్దన్నగా కేసీఆర్ భరోసా
ఉమ్మడి రాష్ట్రంలో వేతన సవరణ అంటే రెగ్యులర్ ఉద్యోగులకేనన్న భావన ఉండేది. రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు పెరుగుతుంటే కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ చిరుద్యోగుల వేతనాలు గొర్రె తోక బెత్తెడు చందంగా ఉండేవి. ఈ పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం సమూలంగా మార్చివేసింది. ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న, క్షేత్రస్థాయి పరిపాలనలో కీలకంగా వ్యవహరిస్తున్న చిరుద్యోగులను ఆదరించింది. సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచి వేతనాలను భారీగా పెంచారు. అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతాలివ్వడం తెలంగాణలో తప్ప మరెక్కడా లేదు. ఇమామ్లు, మౌజమ్లకు సైతం ప్రభుత్వమే నెలనెలా జీతాలిస్తున్నది. సెక్యూరిటీ వింగ్ పోలీసులకు రిస్క్ అలవెన్స్ 30%, ట్రాఫిక్ పోలీసులకు పొల్యూషన్ అలవెన్స్ 30% చొప్పున ఇస్తున్నది. సఫాయి కార్మికులు, ఆశ వర్కర్లు ఇలా అన్ని క్యాటగిరీల్లోని వారికి లబ్ధి చేకూర్చింది. మధ్యాహ్న భోజన కార్మికుల పారితోషికాన్ని రెండురెట్లు పెంచింది.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ తదితర ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో వివిధ కాంట్రాక్టు అధ్యాపక సంఘాల నేతలు సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించి తమ కుటుంబాలను ఆదుకున్న కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదంటూ భావోద్వేగానికి గురయ్యారు. సీఎంను కలిసినవారిలో ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న, తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం, ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి, కార్యదర్శి సురేశ్, మైనారిటీ కాం ట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రహీం, మాలతి, కొండల్, శ్రీనివాస్ తదితరులున్నారు.