హైదరాబాద్, జూన్ 18: ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని, డాక్టర్గా ప్రాణం విలువ తనకు తెలుసని నటి సాయిపల్లవి తెలిపింది. కొన్ని రోజులుగా తన పై జరుగుతున్న ప్రచారంపై ఆమె వివరణ ఇచ్చింది. తాను ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని వెల్లడించింది. విరాటపర్వం సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై కొన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఆమె తాజాగా స్పందించింది. ఈ మేరకు శనివారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసింది. అందులో.. ‘ఒకరి ప్రా ణం తీసే హక్కు మరొకరికి లేదు.
నా దృష్టిలో హింస ముమ్మాటికీ తప్పే. ఒక మెడికల్ గ్రాడ్యుయేట్గా ప్రాణం విలువ నాకు తెలుసు. కొన్ని రోజులుగా నాపై విమర్శలు వస్తున్నాయి. నా వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తూ ప్రచారం చేస్తున్నారు. వాటిపై స్పష్టత ఇచ్చేందుకు మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నా అభిప్రాయాన్ని చెప్పటానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తున్నది. నేనిచ్చిన ఇంటర్వ్యూలో మంచి మనుషులుగా జీవించాలనే ఉద్దేశంతోనే మాట్లాడా. కానీ నా ఇంటర్వ్యూను మొత్తం చూడలేదో, లేక తప్పుగా అర్థం చేసుకున్నారో గానీ ఏవేవో ప్రచారం చేశారు. నేను ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. నా మాటల వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. గడ్డు పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు’ అని పేర్కొన్నది.