హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 11 వేల పాఠశాలల్లో ‘మన ఊరు-మన చెట్టు’ అంశంపై నిర్వహించిన కథల పోటీలకు విద్యార్థులు పోటెత్తారు. ఐదు లక్షల మందికిపైగా విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఒకేసారి, ఒకే సమయంలో లక్షల మంది విద్యార్థులు కథలు రాసి చారిత్రక సందర్భానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ఇది దేశ సాహిత్య చరిత్రలో ఇప్పటివరకు జరగని అపురూప సంఘటన అని పేర్కొన్నారు. ఒక్క మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనే సుమారు 30 వేల మంది పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఈ కథాయజ్ఞంలో పాల్గొనడం.. బాల సాహిత్యానికే అపురూపమైన రోజుగా అభివర్ణించారు. విద్యార్థులు రాసిన కథల్లో అత్యుత్తమ వెయ్యి కథలను ఎంపిక చేసి ప్రత్యేక పుస్తకాన్ని ముద్రిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన 33 జిల్లాల డీఈవోలు, సర్వశిక్ష అభియాన్ బాధ్యులు, పలువురు కలెక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.