హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేయనున్నది. అందులోభాగంగా ప్రభుత్వ, ప్రైవేట్, అటానమస్ విద్యాసంస్థల్లో ప్రత్యేక కమిటీలను నియమించనున్నది. శాంతిభద్రతలు, ట్రాఫిక్, సైబర్ నేరాలు, లైంగిక వేధింపులు, మాదక ద్రవ్యాలు తదితర అంశాలపై ఈ కమిటీలు దృష్టిసారిస్తాయి. గురువారం హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, పోలీస్ ఉన్నతాధికారులు, వర్సిటీల వీసీలతో సమావేశమయ్యారు.
విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో వివిధ కోర్సులు చదువుతున్న 12 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భద్రత కూడా కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు తదితర అంశాలపై అవగాహన కల్పించడం, వాటిని కట్టడి చేయడంలాంటి అంశాలపై సమావేశంలో చర్చించామని తెలిపారు. త్వరలోనే విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో మరో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. సీఎం ఆదేశాలతో మార్గదర్శకాలను విడుదల చేస్తామని వివరించారు.
సేఫ్టీక్లబ్ల రూపం
ప్రతి క్లబ్లో కెప్టెన్, వైస్ కెప్టెన్తోపాటు ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో మూడు కమిటీలు పర్యవేక్షిస్తాయి. టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్లలో ఒకరు కమిటీకి కన్వీనర్గా ఉంటారు. పేరెంట్స్ కమిటీ, లోకల్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో సభ్యులుగా ఉంటారు