Etela Rajender | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): అది కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతం. పైగా రెండు రోజుల కిందటే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగారా మోగింది. ఇలాంటి కీలక తరుణంలో బీజేపీకి బిగ్ షాక్! కాషాయ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్కు అత్యంత సన్నిహితుడు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి బ్యాక్ టు పెవిలియన్ (సొంతగూటికి)కు సిద్ధమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరినపుడు ఆయనతో పాటు వెళ్లిన సదా కేశవరెడ్డి తాజాగా తిరిగి గులాబీ గూటికి వచ్చేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఆదివారం ముఖ్య నేతలతో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. వీళ్లే కాదు, కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కమలం గూటి నుంచి ఇంకా అనేకమంది నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందులో ప్రధానంగా గతంలో ఈటల వెంట వెళ్లిన వారు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది.
కేశవరెడ్డి 2008, 2015 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో రెండవ వార్డు నుంచి వరుసగా ఎన్నికయ్యారు. 2015 నుంచి 2017 వరకు బోర్డు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆది నుంచి ఆయన ఈటల రాజేందర్ వెంటే ఉన్నారు. గతంలో ఈటల టీఆర్ఎస్ నుంచి బీజేపీకి మారినపుడు కేశవరెడ్డి కూడా కమలం పార్టీలోకి వెళ్లారు. బోర్డు పరిధిలో ఆయన కీలక నేత. ఈ క్రమంలో బీజేపీని వీడేందుకు సిద్ధమవటంతో కమలనాథులు కొందరు బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సదాశివరెడ్డి భారీ ఎత్తున అనుచరులతో బీఆర్ఎస్లోకి రానున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి ముఖ్య అనుచరులతో సమావేశం కానున్నారు. అనంతరం మీడియా సమావేశంలో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించే అవకాశమున్నదని తెలుస్తున్నది. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవటం బీజేపీ నేతల్ని ఒక్కసారిగా కలవరానికి గురి చేస్తున్నది. పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతున్నదో తెలియక బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
కమలం నేతలు పైకి ఎన్ని సవాళ్లు విసిరినా, అంతర్గతంగా పార్టీ పరిస్థితి మేడిపండు చందమేనన్న విషయాన్ని అధిష్ఠానం ముందుగానే గుర్తించిందని పార్టీ నేతలే చెబుతున్నారు. అందుకే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను వాయిదా వేయాలంటూ ప్రస్తుత బోర్డు నామినేటెడ్ సభ్యుడు (బీజేపీకి చెందిన) రామకృష్ణ పలుమార్లు డిమాండు చేశారు. రెండు రోజుల కిందట జరిగిన ప్రత్యేక బోర్డు సమావేశంలోనూ వార్డుల పునర్విభజన సాకుతో ఎన్నికలు వాయిదా వేయాలనే డిమాండు వినిపించగా… బోర్డు అధికారులు ఆయనపై అసహనం వ్యక్తం చేశారు. తాజాగా సదా కేశవరెడ్డి బీఆర్ఎస్లోకి వచ్చే విషయం తెరపైకి వచ్చిందిగానీ, చాలా కాలం నుంచే కమలం పార్టీలో ముసలం నెలకొన్న దరిమిలా అధిష్ఠానం నామినేటెడ్ సభ్యుడితో ఎన్నికల వాయిదాకు డిమాండ్ చేయించిందనే ప్రచారం కూడా ఉంది. తాజాగా బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ముఖ్య అనుచరుడు సదా కేశవరెడ్డి పార్టీని వీడుతున్నట్టు వెలుగులోకి రావటంతో ఈ ప్రచారం నిజమేనని తెలుస్తున్నది.