Sabitha Indra Reddy |కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకునే పరిస్థితిలో లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం అంతా భూముల చుట్టే తిరుగుతుందని అన్నారు. భూములు ఎక్కడ ఉంటే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారని తెలిపారు. ప్రజలు ఏమైపోయినా మా ఖజానా నిండాలని కాంగ్రెస్ మంత్రులు భావిస్తున్నారని విమర్శించారు.
రంగారెడ్డి జిల్లా కోహెడ్ పండ్ల మార్కెట్ను మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కోహెడకు పండ్ల మార్కెట్ వస్తే స్థానిక ప్రజలు బాగుపడతారని కేసీఆర్ భావించారని తెలిపారు. కానీ ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలంటే వేరే చోట స్థలం కేటాయించవచ్చు కదా అని ప్రశ్నించారు. మార్కెట్ను కాపాడుకోవడానికి అందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు, స్థానికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Devireddy Sudheer Reddy
పండ్ల మార్కెట్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ 170 ఎకరాల స్థలం కేటాయించారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ నిర్మించాలని నిధులు కూడా కేటాయించారని పేర్కొన్నారు. ఆ మార్కెట్ స్థలంపై ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియా కన్ను పడిందని అన్నారు. మార్కెట్ స్థలాన్ని పెద్దలకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. మార్కెట్ను అభివృద్ధి చేసే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.