Sabitha Indra Reddy | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు, కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షుపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ కేశవ్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవన నూతన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు ,ప్రభుత్వ విప్ గాంధీతో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మనుమడు,ఒక్రిడ్జి పాఠశాల సీఏఎస్ అధ్యక్షులు హిమాన్షు జన్మదినం సందర్భంగా సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన పాఠశాలను ప్రారంభించి, విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి హిమాన్షుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…చాలా మంది పుట్టిన రోజులు స్నేహితులు, బంధువుల మధ్యలో హంగు ఆర్భాటాలతో చేసుకుంటారని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు అయిన హిమాన్షు పేద, మధ్య తరగతి విద్యార్థుల మధ్యలో చేసుకోవడం అభినందనీయమన్నారు. క్యాన్సర్ ఆసుపత్రితో పాటు, అనాధ ఆశ్రమంలో, వృద్ధాశ్రమామంలో జరుపుకోవడం నేటి యువతకు ఒక గొప్ప సందేశం ఇచ్చినట్లయిందన్నారు. తాను చదివే ఒక్రిడ్జి పాఠశాల విద్యార్థులతో కలిసి సేవ కార్యక్రమాలు చేపట్టడటం సంతోషాదాయకం అన్నారు. పేద విద్యార్థులు చదివే కేశవ నగర్ పాఠశాలను దత్తత తీసుకొని అన్ని హంగులతో తీర్చిదిద్దటం ఎంతో గొప్ప విషయం అన్నారు. అదే విధంగా చెరువు సుందరీకరణ పనులు చేపట్టడానికి ముందుకురావటం శుభ పరిణామం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పేద విద్యార్థుల గురించి తపన పడుతుంటారని, అలాంటి లక్షణాలే వారి మనువడికి రావటం జరిగిందన్నారు. కేటీఆర్ కూడా గంభీరావుపేటలో ఒక పాఠశాల ప్రారంభానికి వెళ్లి తన అమ్మమ్మ పేరుతో పాఠశాల నిర్మాణానికి ముందుకు వచ్చి పూర్తి చేసారన్నారు.
ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలన్నట్లు, విద్యార్థులతో ఓ సామాన్యునిగా కలిసిపోయిన హిమాన్షు రావును మంత్రి అభినందించారు. నూతనంగా నిర్మించిన పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పించారని, ఇందులో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరినీ మంత్రి అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలకు పేద విద్యార్థులే వస్తారని, వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెబుతుంటారని, అందులో భాగంగా రాష్ట్రంలోని 26 వేల పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించటానికి రూ. 7200 కోట్ల పై చిలుకు నిధులు కేటాయించారని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు అందిస్తూ, డ్రెస్సులు ఇస్తూ, ఉదయం పూట రాగి జావా అల్పాహారంగా అందిస్తున్నారన్నారు. చాలా మంది ఇంగ్లీష్ మీడియం కోసమే ప్రయివేటు పాఠశాలలకు పోతున్నారాని ముఖ్యమంత్రి కేసీఆర్ గత సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రారంభించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టూ పీజీ నినాదాన్ని మాటలతో కాకుండా చేతలతో చూపెట్టారని మంత్రి పేర్కొన్నారు. 1000 గురుకులాలు స్థాపించి, వాటిలో పాత వాటితో కలుపుకొని 1200 గురుకులాలు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసారన్నారు. అన్ని శాఖల్లో కలిపి 1450 జూనియర్ కళాశాలలు ఉన్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ నా మనుమడు ఏ బియ్యంతో తింటే అదే బియ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తినాలని చెప్పారని, నేటికి అదేవిధంగా అమలు చేస్తున్నారన్నారు.
తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లిన రాణించేలా తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని ఆ దిశగా నేడు అడుగులు పడ్డాయన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థులకు నైతిక విలువల బోధించాలని మంత్రి పిలుపునిచ్చారు. విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేసిన అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఒక్రిడ్జి ఇంటర్నేషనల్ పాఠశాల ప్రిన్సిపాల్ దీపికా రావు, సీఏఎస్ కో ఆర్డినేటర్, ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు.