హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): మన ఊరు – మన బడి కార్యక్రమం విద్యాయజ్ఞమని, సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ పథకానికి నిధుల కొరత లేదని, జిల్లాలకు అడ్వాన్స్గా నిధులను విడుదల చేశామని చెప్పారు. సోమవారం బీఆర్కే భవన్లో మన ఊరు -మన బడి కార్యక్రమంపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. మన ఊరు- మన బడిలో మంజూరు చేసిన పనులన్నింటినీ సీనియర్ అధికారులతో తనిఖీ చేయించాలని ఆదేశించారు. పనుల ప్రారంభానికి ముందు పాఠశాల ఎలా ఉండేది? పనులు పూర్తయ్యాక ఎలా ముస్తాబయ్యింది? అన్న తేడాలు స్పష్టంగా కనిపించేలా ఫొటోలు తీయించాలని సూచించారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించి, నాణ్యత పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని చెప్పారు.
12 రకాల అంశాలకు ప్రాధాన్యం
ఈ కార్యక్రమానికి మొదటి విడతలో 9,123 స్కూళ్లను ఎంపిక చేశామని, వీటిలో 12 రకాల అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి సబిత చెప్పారు. ఇందుకుగాను రూ.3,497.62 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. రూ.30 లక్షలలోపు పనులను పాఠశాల నిర్వహణ కమిటీలకు అప్పగించామని, రూ.30 లక్షల పైబడిన అంచనా పనులను టెండర్ల ద్వారా చేపడుతున్నామని వివరించారు. సీఎస్ సోమేశ్ మట్లాడుతూ.. రూ.30 లక్షల లోపు పనులకు ఈ నెల 10 లోపు పరిపాలన అనుమతులు మంజూరు చేసి, 15 నుంచి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన పాల్గొన్నారు.