Sabitha Indra Reddy | హైదరాబాద్ : తెలుగు పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరుంటే తప్పేంటని మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో జగన్ బొమ్మలతో కూడిన కిట్లను పిల్లలకు యధావిధిగా పంపిణీ చేయాలని, ప్రజాధనం వృధా చేయొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ సీఎం చంద్రబాబు హుందాగా వ్యవహరించారు. ఆయనను చూసి నేర్చుకోవాలని రేవంత్కు సబిత చురకలంటించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉండడంతో ఆ పుస్తకాలను తిరిగి తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సబిత స్పందించారు.
కేసీఆర్ ఫొటో, కేసీఆర్ గుర్తు తొలగించాలనే ఆలోచనను పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని రేవంత్కు సబిత సూచించారు. ఆరు నెలలైనా ఈ ప్రభుత్వం పాలనపై దృష్టి సారించలేదు అనడానికి ఈ వ్యవహారమే ప్రత్యేక నిదర్శనం. తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే జయలలిత ఫొటోతో ఉన్న బుక్స్, బ్యాగ్స్ను యధావిధిగా విద్యార్థులకు ఇచ్చి తమ హుందాతనాన్ని చాటుకున్నారు. పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు.. జగన్ బొమ్మతో గల కిట్లను పంపిణీ చేయాలని, ప్రజా ధనం వృధా చేయకండని ఆదేశించి ఎంతో హుందాగా వ్యవహరించారు. మరి మీ హుందాతనం ఎక్కడికి పోయింది..? అని రేవంత్ను నిలదీశారు సబిత.
విద్యార్థులకు ఇచ్చిన బుక్స్లో కేసీఆర్ పేరు ఉందని, బుక్స్ వెనక్కి తెప్పించడం, ఆ పేజీలను చింపేయడం, ఆ పేజీలపై మరో పేజీ అతికించడం సమంజసమా..? ఈ అనాలోచిత చర్యల వల్ల ప్రజాధనం వృధా కాదా..? చింపేసిన పేజీల వెనుకాల వందేమాతరం, జనగణమన గేయాలు, ప్రతిజ్ఞలు ఉన్న పట్టింపు లేదా..? కేసీఆర్ మీద కోపంతో జాతీయ గీతాన్ని కూడా అవమానిస్తారా..? ఈ ప్రభుత్వానికి ఇది తగునా..? అని సబిత ప్రశ్నించారు.
తాము పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ ఆలస్యంగా అందించే సంస్కృతికి ముగింపు పలికి, ఆరు నెలల ముందు నుంచే ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్లి వాటిని విద్యార్థులకు అందించే ప్రయత్నం చేశామని సబిత గుర్తు చేశారు. తాము ఏటా 23 లక్షల మంది విద్యార్థులకు రూ. 108 కోట్లు వెచ్చించి రెండు జతల యూనిఫామ్స్, రూ. 200 కోట్లు వెచ్చించి 1.90 కోట్ల ఉచిత పుస్తకాలను ముద్రించి సకాలంలో అందించామన్నారు. ఇక రాష్ట్రంలో తొలిసారిగా ఏ ప్రభుత్వం చేయని విధంగా రూ. 34.70 కోట్లతో 11.27 లక్షల మందికి వర్క్ బుక్స్, రూ. 56.24 కోట్లతో 12.30 కోట్ల ఉచిత నోట్ బుక్స్ పంపిణీకి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. విద్యార్థులందరికీ తాము జూన్ 12వ తేదీనే యూనిఫామ్స్, పుస్తకాలు అందజేశాం. ఈ ఏడాది బుక్స్తో పాటు బ్యాగ్స్ ఇవ్వమని కేసీఆర్ ఆదేశంతో విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా హుందాగా ప్రవర్తించండి. పాలన మీద దృష్టి పెట్టమని ఈ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను అని సబిత పేర్కొన్నారు.