హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ) : రేవంత్సర్కార్ నిర్లక్ష్యం వల్లే కల్యాణలక్ష్మి, షాదీముబారక్లపై న్యాయస్థానం స్టే విధించిందని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. పేదింటి బిడ్డలకు ఈ పథకాల ఫలాలు అందకూడదనే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఒక ప్రకటనలో పే ర్కొన్నారు.
హైకోర్టులో దాఖలైన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడానికి పలుమార్లు అవకాశమిచ్చినా స్పందించకపోవడం ఈ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ప్రత్యక్ష నిదర్శనమని ధ్వజమెత్తారు. సెప్టెంబరు 9లోగా ప్రభు త్వం ఉన్నత న్యాయస్థానంలో కౌం టర్ దాఖలు చేసి, స్టే ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని హెచ్చరించారు.