హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): సర్కార్ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో మొదటి విడత పనులను వేగవంతం చేయాలని జిల్లాల కలెక్టర్లను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. 200 మంది విద్యార్థులు దాటిన పాఠశాలల్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. గురువారం ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో చేపట్టిన పనుల పురోగతిపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
డిసెంబర్ చివరినాటికి ప్రతి మండలంలో కనీసం రెండు పాఠశాలలోనైనా పను లు పూర్తి చేసి, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం కింద రూ.7,289 కోట్లు కేటాయించామని, తొలి విడతగా 9,123 బడుల్లో 12 రకాల మౌలిక సదుపాయల కల్పనకు రూ.3,497 కోట్లు విడుదల చేశామని మంత్రి వివరించారు. ఈ నెలాఖరుకు రాష్ట్రవ్యాప్తంగా 1,210 పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలని చెప్పారు. వీటికి వెంటనే డ్యూయల్ డెస్లను అందజేయడంతోపాటు గ్రంథాలయాలు, ఆట స్థలాలను సిద్ధం చేయాలని సూచించారు. పనులు పూర్తి అయిన ఉన్నత పాఠశాలలకు డైనింగ్ హాల్ ఫర్నిచర్ ఇవ్వాలని విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్లో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ దేవసేన, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.