హైదరాబాద్, జనవరి 12(నమస్తే తెలంగాణ): యాసంగి పంట పెట్టుబడి సాయం కింద గురువారం 1.76 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.482.32 కోట్ల రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 60.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.5,801.06 కోట్లు జమ చేశామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పథకాల ప్రభుత్వమైతే.. మోదీ ప్రభుత్వం పన్నుల ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలే తెలంగాణ ప్రభుత్వ పథకాలకు ప్రాతిపదిక అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటా సున్నా అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, అభివృద్ధికి తోడ్పాటు అందివ్వకపోగా అడ్డుపడుతుండటం తెలంగాణపై కేంద్రం వివక్షకు నిదర్శనమని మండిపడ్డారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్ పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీకి రాద్ధాంతం తప్ప సిద్ధాంతం, విలువలు లేవని దుయ్యబట్టారు. ఆ పార్టీలది తెలంగాణలో ఒడిసిన ముచ్చట అని ఎద్దేవాచేశారు. ప్రజల ఆశీస్సులతో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.