హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో 10వ విడత రైతుబంధు నగదు జమ కొనసాగుతున్నది. ఐదో రోజు సోమవారం 1,51,468 మంది రైతుల ఖాతాల్లో రూ.265.18 కోట్ల నగదు జమ అయింది. ఇప్పటివరకు మొత్తంగా 5,30,371.31 ఎకరాలకు రైతుబంధు నిధులు జమ అయ్యాయి. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రైతుల ముఖాల్లో ఆనందం చూడటమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు, సాగునీళ్లు లేక రైతాంగం వ్యవసాయం వదిలేసి వలసబాట పట్టారని గుర్తుచేశారు.
బోరు బావుల కింద వ్యవసాయం చేయలేక రైతాంగం నష్టాలపాలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. స్వరాష్ట్రంలో ఎనిమిదేండ్లలోనే తెలంగాణ వ్యవసాయరంగ స్వరూపం మారిపోయిందని వివరించారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు పథకాలు చరిత్రాత్మకమైనవని చెప్పారు. వ్యవసాయ రంగం బలపడితేనే దేశం పటిష్ఠంగా ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ పథకాలను మెచ్చి దేశ రైతాంగం బీఆర్ఎస్ వైపు చూస్తున్నదని తెలిపారు. ‘సంపద పెంచాలి.. ప్రజలకు పంచాలి’ అన్నదే కేసీఆర్ విధానమని పేర్కొన్నారు. 47.75 లక్షల మందికి ప్రతి నెలా పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, పింఛన్లు పొందుతున్నవారిలో చిన్న, సన్నకారు రైతులు కూడా ఉన్నారని చెప్పారు.