నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 14: పెట్టుబడి సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్కు రైతులు జై కొడుతున్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఊరూరా సంబురాలు జరుపుకొంటున్నారు. శుక్రవారం మహిళా రైతులు తమ ఇండ్ల ముందు ‘జై కేసీఆర్, జై రైతుబంధు’ అంటూ ముగ్గులు వేసి కృత జ్ఞతలు తెలిపారు. రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో ర్యాలీలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సంబురాల్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశానికి అన్నంపెట్టే రైతన్నకు అండగా నిలిచిన కేసీఆర్ను యావత్ దేశ రైతాంగం ప్రశంసిస్తున్నదని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.10 వేలు అందిస్తూ రైతులకు అండగా నిలిచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే టీ రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పల్లా నవధాన్యాభిషేకం చేశా రు. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం నందిన్నెలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లిలో, వనపర్తి జిల్లా కేంద్రం లో రైతులు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లిలో సీఎం కేసీఆర్తో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కరోనా కష్టకాలంలోనూ పెట్టుబడి సాయం అందించిన తెలంగాణ సర్కారుకు రుణపడి ఉంటామని రైతులు పేర్కొన్నారు. ధర్మారం మండలం రామయ్యపల్లిలో ఎడ్లబండ్ల ర్యాలీ తీశారు. నందిమేడారంలో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని పాలతో అభిషేకించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో నిర్వహించిన సంబురాల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీర య్య పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. ముదిగొండ మండల కేంద్రంలో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు తదితరులు పాల్గొన్నారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోలుకొండలో రైతుబంధు లబ్ధిదారు మాచర్ల బాబు తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అక్షర ఆకృతిలో మొలకలు అలికాడు. పేద రైతులకు రైతుబంధు ఓ వరమని.. తన కుటుంబానికి ఎకరం భూమి ఉండగా రైతుబంధు పెట్టుబడికి సరిపోతుందని బాబు పేర్కొన్నాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన తోట పవన్వర్మ సంబురాల్లో భాగంగా సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావుపై ప్రత్యేకాభిమానాన్ని చాటాడు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఎన్డీఆర్, ఎన్వీఆర్ అనే ఆంగ్ల అక్షర ఆకృతిలో నారు పెంచాడు.