కార్పొరేటర్లకు రైతు రక్షణ సమితి సూచన
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రిని కలిసే అవకాశం మళ్లీమళ్లీ రాదని, వచ్చిన ఈ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని బీజేపీ కార్పొరేటర్లకు తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు విజ్ఞప్తి చేశారు. త్వరలో బీజేపీ గ్రేటర్ కార్పొరేటర్లు ప్రధాని నరేంద్రమోదీని కలువనున్నారు.
ఈ నేపథ్యంలో శ్రీహరిరావు వారికి పలు సూచనలు చేశారు. ప్రధానిని కలిసిన సందర్భంలో ఎనిమిదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ఆయనకు వివరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ కక్ష కారణంగా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో తెలియజేయాలని చెప్పారు. విభజన చట్టంలోని హామీలను ఎందుకు నెరవేర్చలేదో నిలదీయాలని అన్నారు. తెలంగాణలో కనీసం ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, మెడికల్ కాలేజీలు, తర విద్యా సంస్థలు ఎందుకు ఇవ్వలేదో అడగాలని సూచించారు.