హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో లక్షల ఎకరాలలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతురక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగినప్పటికీ కేంద్రప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించటం శోచనీయమని తెలిపారు. కేంద్రప్రభుత్వం సాంకేతిక కారణాలు చూపి తప్పించుకోకుండా, మానవతా ధృక్పథంతో ప్రతి ఎకరాకు రూ.10 వేలు సహాయం అందించాలని కోరారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకానికి ప్రస్తుతం అవలంబిస్తున్న విధానం వల్ల రైతులు వారికి తెలియకుండానే ప్రతి ఎకరాకు రూ.10 నుంచి రూ.15 వేలు నష్టపోతున్నారని చెప్పారు. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతుకు లాభం చేకూరుతుందని సూచించారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్రప్రభుత్వం అందిస్తున్న సహాయంతో ఏ రైతుకు ప్రయోజనం లేదని పేర్కొన్నారు.