కల్వకుర్తి/ వంగూర్, మే 27 : ‘ధాన్యం కొనాలంటే రైతులు అధికారుల, ప్రజాప్రతినిధుల కాళ్లు మొక్కాలా?. ధాన్యం కొనాలని ధైర్యంగా అడిగితే కేసులు నమోదు చేస్తారేమోనని రైతులు భయపడుతున్నారు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా వంగూరులో రైతు మహాధ ర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి మాట్లాడటమే తప్పవుతున్నదని, దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్ను ఉద్యోగం నుంచి తొలగించడమేనని, ఇంతకన్న దౌర్భాగ్యం ఇంకేదైనా ఉంటుందా అని ప్రశ్నించారు.
రైతుల సమస్యల గురించి మాట్లాడితే కేసులు నమోదు చేసి జైళ్లకు తరలిస్తున్నారని, అయినా బీఆర్ఎస్ పార్టీ సింహంలా గర్జిస్తూ రైతుల పక్షానా పోరాటాలు చేస్తూనే ఉం టుందని తెలిపారు. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని సీఎం రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు. ఏం రివ్యూలు చేస్తున్నాడని ఆరా తీస్తే.. రాష్ట్రంలోని అసైన్డ్ భూముల వివరాలు, వాటి సర్వే నంబర్ల గురించి రివ్యూలు చేస్తున్నాడని తెలిసిందని పేర్కొన్నారు. ఏ సర్వే నంబర్లో ఎంత అసైన్డ్ భూమి ఉన్నది. ఏ విధంగా కొల్లగొట్టాలని నిరంతరం సమీక్ష చేయడంలో రేంవత్రెడ్డి సిద్ధహస్తుడని ఆర్ఎస్పీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ రైతుల సంక్షేమ ముఖ్యమంత్రి అయితే.. రేవంత్రెడ్డి మాత్రం సర్వే నంబర్ల ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి మరణ వాంగ్మూల లేఖకు విలువ లేకుండా పోయిందని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి చనిపోతూ తన ఆత్మహత్యకు కారకుల గు రించి రాస్తే.. ఆ లేఖను పట్టించుకోకుండా కేసును నీరుగార్చిన ఈ ప్రభుత్వం నేరస్తులకు చుట్టంగా మారిందన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి మర్రి జనార్దన్రెడ్ది విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు విలవిలలాడుతున్నారని వాపోయారు. రైతుల గొంతుకగా బీఆర్ఎస్ ఉంటుందని మర్రి చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్లనే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. ‘నిర్దిష్ట ప్రణాళిక ఏర్పాటు చేసుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదు కదా.. ఈ పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని డిమాండ్ చేశారు.