వద్దన్నా వరి పంట సాగుచేసే రైతులకు రైతుబంధు ఎందుకివ్వాలి? వరి సాగుచేసే రైతులకు రైతుబంధు నిలిపివేసి ఇతర పంటలు సాగుచేసే వారికి మాత్రం కొనసాగిస్తే ఎలా ఉంటుంది? ఇది వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం ముందుంచిన ప్రతిపాదన
హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): వడ్లు కొనుగోలు చేసేందుకు కేంద్రం ససేమిరా అనడం, రాష్ట్రం ముందు మరో మార్గాంతరం లేకపోవడంతో రైతులను ఈ సంకటం నుంచి ఎలా బయటపడేయాలా అని రాష్ట్ర వ్యవసాయశాఖ తీవ్రంగా ఆలోచిస్తున్నది. రైతులు వరి పంట వేసి నష్టపోకుండా చూసేందుకు తరుణోపాయాలు ఏమిటంటూ గత కొద్ది రోజులుగా వ్యవసాయరంగ నిపుణులు, రైతుసంఘాల ప్రతినిధుల నుంచి సలహాలను కోరుతున్నది. ఇలా సేకరించిన అభిప్రాయాలతో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు సమర్పించారు. బుధవారం చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్తో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం, వడ్ల సేకరణ, యాసంగి వరిసాగు అంశాలపై పరిస్థితిని నివేదించారు. అనేక జిల్లాల్లో ధాన్యం సేకరణ విజయవంతంగా పూర్తవుతున్నదని చాలా జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తయిపోయి, 95 శాతం కొనుగోలు కేంద్రాలను మూసివేశారని వారు వివరించారు. ఈ సందర్భంగా వరిసాగు, ధాన్యం సేకరణలో తలెత్తుతున్న సమస్యలను ముఖ్యమంత్రికి ఏకరువు పెట్టారు. ‘ఉదాహరణకు రాష్ట్రంలో అత్యధికంగా వరిసాగు అయ్యే జిల్లాల్లో నిజామాబాద్ ఒకటి. నిజామాబాద్ జిల్లాలో 458 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేశాం. 6.51 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఏకంగా రూ.1,300 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశాం. 456 కొనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరణను పూర్తిగా ముగించుకొని మూతపడ్డాయి. రెండే రెండు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం సేకరణ జరుగుతున్నది. కామారెడ్డి జిల్లాలో 344 కేంద్రాలను తెరువగా 266 కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తయింది. 4.55 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి రూ.900 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశాం. వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంటే, కొంతమంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. నిన్న మాచారెడ్డిలో ధాన్యం సేకరణ కేంద్రంలో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. తరుగు ఎక్కువ తీస్తున్నారని చెప్పి అక్కడ రైతుల ముసుగులో రాజకీయ ఆందోళనకు తెరతీశారు. ఎంత పకడ్బందీగా ధాన్యం సేకరణను పూర్తిచేసినా, కొంతమంది అవగాహన లేని రైతులు, రాజకీయ పబ్బం గడుపుకొనే నాయకుల వల్ల ఇబ్బంది తప్పడంలేదు. ఈ నేపథ్యంలో వరి సాగుచేసే రైతులకు రైతుబంధు ఇవ్వడం అవసరమా? వరి మినహా ఇతర పంటలు సాగుచేసే వారికే రైతుబంధును పరిమితంచేస్తే ఎలా ఉంటుంది’ అని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ప్రతిపాదనలు ఉంచినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అధికారుల ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ చిరునవ్వు నవ్వి.. ‘మన రైతులపై మనమే కోపగించుకొంటే ఎలా? ఈ సమస్యకు అంతిమ పరిష్కారం ఏమిటి? మీరూ ఆలోచించండి.. నేనూ ఆలోచిస్తా.. శుక్రవారం మా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం జరుగబోతున్నది. ఆ సమావేశంలో కూడా చర్చిస్తా’ అని వ్యవసాయశాఖ అధికారులను సముదాయించినట్టు తెలిసింది. అయితే వ్యవసాయశాఖ అధికారులు తమ ప్రతిపాదనలను బలపరుస్తూ పలు కోణాల్లో నివేదించినట్టు సమాచారం. ‘పారాబాయిల్డ్ రైస్ను గింజ కూడా కొనేది లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేశారు. యాసంగిలో మనకు పండేదే పారాబాయిల్డ్ రైస్. మరోవైపు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి పార్బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్తున్నాం కదా.. అని కేంద్రం వైఖరిని సమర్థించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సేకరణ యంత్రాంగం ఉన్న ప్పటికీ.. నిల్వ వ్యవస్థ కానీ, ఎగుమతుల అధికారం కానీ లేదు. ధాన్యం, వడ్లపై అధికారాలన్ని కేంద్రం వద్దే ఉన్నాయి. అలాంటి కేంద్రమే మేం ధాన్యం తీసుకోం అంటున్నప్పుడు రాష్ట్రం సేకరించే సమస్య ఎలా ఉత్పన్నమవుతుంది? ఒకవేళ సేకరించినా.. దాన్ని మనం ఏం చేసుకోగలం?’ అని ఒక అధికారి ముఖ్యమంత్రి ముందు వాదించినట్టు సమాచారం. ‘వరి వేసే వారికి కూడా రైతుబంధు ఇస్తూనే పోతే వారు వరి వేస్తూనే ఉంటారు. చివరకు అలా పండిన ధాన్యాన్ని అమ్ముకోలేక నష్టపోతారు. ఇది వ్యవసాయ రంగంలో సంక్షోభానికి దారితీస్తుంది. అందువల్ల రైతుబంధును వరి మినహా ఇతర పంటలు వేసిన వారికి మాత్రమే ఇస్తామని స్పష్టంచేస్తే తెలంగాణ రైతును రాబోయే నష్టాల బారినుంచి కాపాడవచ్చు’ అని మరో అధికారి సూచించినట్టు తెలిసింది. తెలంగాణలో వ్యవసాయ యంత్రాంగం ఎలాగూ పటిష్ఠంగా ఉన్నదని, అందువల్ల రైతుబంధును కొద్దిరోజులు ఆపి.. ఏయే రైతులు వరివేశారో.. ఎవరు వేయలేదో లెక్కలు తెప్పించుకొని.. వరి వేయని రైతులకు మాత్రమే రైతుబంధు ఇస్తే బాగుంటుందని మరో అధికారి సలహా ఇచ్చినట్టు సమాచారం.
ఇదే సమావేశంలో పాల్గొన్న ఒక సీనియర్ నేత కూడా వరి నుంచి రైతులను ఇతర పంటలవైపు మళ్లించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ‘మనం రైతుబంధు ఇస్తున్నాం. రైతులు వరి వేస్తున్నారు. ఆ ధాన్యాన్ని కేంద్రం కొనడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర నేతలేమో.. వరితో.. రైతులతో రాజకీయం చేస్తున్నారు. కొందరు వరి రైతులు వారి మాయలో పడి ధర్నాలు, ఆందోళనలకు మోసపోతున్నారు. వరి రైతులకు రైతుబంధు ఇవ్వడం అంటే.. రైతును నష్టపరచడమే కాదు.. మనమే వారిని ఆందోళనలకు ప్రేరేపించినట్టు కూడా’ అని ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని టీవీ చానళ్లు బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘కొన్ని టీవీ చానళ్లు వడ్ల సమస్యపై చర్చలు పెట్టి.. వరి వద్దంటే మరి కాళేశ్వరం ఎందుకు కట్టారు.. నీళ్లెందుకు తెచ్చారు? అని పిటీ చర్చలు పెడుతున్నాయి. అందులో పాల్గొనే ప్యానలిస్టులు అంతే అవివేకంతో మాట్లాడుతున్నారు. నీళ్లు కేవలం వరికి మాత్రమే అవసరమా? ఇతర పంటలకు అవసరం లేదా? నీళ్లు లేకుండా ఏ పంటైనా పండుతుందా? రాష్ట్రంలో రాజకీయం ఇట్లా సాగుతున్నది. అందువల్ల ఆరు నూరైనా వరి రైతును ఇతర పంటలవైపు మళ్లించాల్సిందే అందుకోసం వరి రైతులకు రైతుబంధు నిలిపివేయాల్సి వస్తే అందుకు కూడా ప్రభుత్వం సిద్ధపడాలి’ అని ఆయన గట్టిగా వాదించినట్టు సమావేశంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. ఇవి అవేశకావేశాలకు సమయం కాదని.. అన్నం పెట్టే రైతు విషయంలో ఆదరాబాదరాగా నిర్ణయం తీసుకోవద్దని.. తీసుకోలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి హితవు చెప్పినట్టు సమాచారం. సమస్య ఉన్నమాట వాస్తవమేనని, దీనికి తక్షణ దీర్ఘకాలిక పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. యాసంగిలో వరిపంట వేస్తే మాత్రం రైతులు నష్టపోక తప్పదన్న అంచనాతో సీఎం ఏకీభవించినట్టు తెలిసింది. కేంద్రం నిరంకుశ ధోరణిని గమనించి.. రైతుల శ్రేయస్సును, మేలును కోరి.. వరి వద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో చెప్తున్నదని, వరిని వేయాలంటూ బండి సంజయ్ చెప్తున్న మాటలు రైతులు వినాలనుకొంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయజాలదని సీఎం కేసీఆర్ అన్నట్టు సమాచారం. ఏది మంచి మొక్కో.. ఏది కలుపు మొక్కో రైతులకు బాగా తెలుసని.. ఎవరు తమకోసం పని చేస్తున్నారో.. ఎవరు తమను మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత రైతులపైన ఉన్నదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.
ఈ యాసంగి సీజన్లో రైతుబంధు అర్హుల సంఖ్య మరో రెండు లక్షల వరకు పెరిగింది. కొత్తగా సుమారు లక్ష ఎకరాల భూమి కూడా రైతుబంధు జాబితాలోకి చేరనున్నది. ధరణితో భూ వివాదాలు పరిష్కారమైన నేపథ్యంలో.. గతంలో అనర్హులుగా మిగిలిన రైతులకు ఈ సీజన్లో రైతుబంధు అందనున్నది. ఈ నెలాఖరులో రైతుబంధు పంపిణీకి వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే రెవెన్యూశాఖ నుంచి రైతులు, భూమి వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. గత సీజన్లో 60.84 లక్షల మంది రైతులకు రూ.7,360.41 కోట్లను రైతుబంధు కింద ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ సీజన్లో సుమారు రూ. 7500 కోట్ల వరకు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.