KTR | దేశ వ్యవసాయరంగ చరిత్రలో రైతుబంధు శాశ్వతంగా నిలిచిపోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు పథకం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణ రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. ఓ పాలకుడే రైతుగా ఉన్న అపూర్వమైన సందర్భం తెలంగాణలో ఉన్నదని, అందువల్లనే రైతుల కష్టసుఖాలు సంపూర్ణంగా అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు రైతుబంధు కార్యక్రమం రూపుదిద్దుకున్నదని కేటీఆర్ గుర్తు చేశారు. రైతుబంధుతో రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖచిత్రం మారిపోయిందంటే అతిశయోక్తి కాదన్నారు.
వ్యవసాయం దండగ అన్న గత పరిపాలకుల ఆలోచన విధానాలకు భిన్నంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, తద్వారా అత్యధిక శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం వలన సమాజంలో సంపద సృష్టించబడుతుందన్న ఓ వినూత్నమైన ఆలోచన విధానంతోనే రైతుబంధు పథకం రూపుదిద్దుకున్నదని కేటీఆర్ అన్నారు. రైతుబంధు పథకాన్ని 2018లో ప్రారంభించామని, సంవత్సరానికి రూ.10వేల చొప్పున 70లక్షల మంది రైతులకు పది విడతల్లో రూ.65,500కోట్లు అందించడం జరిగిందన్నారు.
ఇలా దేశ చరిత్రలో రైతులకు ఇంత భారీ ఎత్తున పెట్టుబడి సహాయాన్ని అందించిన ప్రభుత్వం ఎప్పుడు లేదన్న కేటీఆర్, కేవలం రైతులకు రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక మద్దతు అందించడంతోనే ఆగిపోకుండా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో పూర్తి చేయడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేశారన్నారు. తెలంగాణకు అందుబాటులో ఉన్న నదీ జలాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలన్న విస్తృత లక్ష్యంతో సీఎం కేసీఆర్ చేసిన సాగునీటి కార్యక్రమాలతో లక్షలాది ఎకరాలు నూతనంగా సాగులోకి వచ్చాయన్నారు.
దీంతోపాటు దేశంలో ఎక్కడ లేనివిధంగా 24 గంటల కరెంటు ఉచితంగా రైతులకు అందించడంతోపాటు, రైతు వేదికల నిర్మాణము, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున వ్యవసాయ శాఖలో అధికారుల రిక్రూట్మెంట్, పండించిన ప్రతి గింజను కొనేలా చేపట్టిన కార్యక్రమాలు, రైతు మరణాలతో ఇబ్బందులు ఎదురవకుండా రైతు కుటుంబాల కోసం చేపట్టిన రైతుబీమా కార్యక్రమం ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతన్న కోసం ఇన్ని కార్యక్రమాలను చేపట్టలేదని కేటీఆర్ అన్నారు.
రైతన్నల కోసం ఎంత చేసిన తక్కువనే అనే గొప్ప మనసున్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వ్యవసాయ రంగ ప్రగతి కోసం నిరంతరం పాటుపడుతుందని, ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవసాయ అభివృద్ధి, రైతాంగ సంక్షేమ కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర రైతాంగంపై అచంచలమైన ప్రేమతో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు వినూత్న కార్యక్రమాలను చేపట్టి ఎప్పటికప్పుడు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు తెలంగాణ రైతాంగం తరఫున సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.