హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6 వేల సాయం అందిస్తామని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించడం బీఆర్ఎస్ తొలి విజయమని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ అన్నారు. రైతుల పార్టీ బీఆర్ఎస్ గులాబీ జెండాకు భయపడే మహారాష్ట్రలోని బీజేపీ సర్కార్ ఈ ప్రకటన చేసిందని చెప్పారు. భారత కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్, ఔరంగాబాద్ డివిజన్ కో ఆర్డినేటర్ సోమనాథ్ థోరట్తో కలిసి శంభాజీనగర్, ఔరంగాబాద్లో శుక్రవారం మీడియా సమావేశంలో హిమాన్షు తివారీ మాట్లాడారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’ నినాదం ప్రభావం మహారాష్ట్రతోపాటు యావత్ దేశ రైతులను ఆకర్షిస్తున్నదని తెలిపారు.
నాందేడ్ సభతో మహారాష్ట్ర రైతుల నుంచి కేసీఆర్కు, గులాబీ జెండాకు వస్తున్న ఆదరణకు భయపడి మహారాష్ట్ర సర్కారు పెట్టుబడి సాయం నిర్ణయం తీసుకున్నదని స్పష్టంచేశారు. ఇది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో సాధించిన తొలి విజయమని అభివర్ణించారు. తెలంగాణ అభివృద్ధి నమూనానే మహారాష్ట్ర రైతులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు ఇవ్వలేరని ప్రశ్నించారు. తెలంగాణలో అమలవుతున్న ప్రతి రైతు సంక్షేమ పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాం డ్ చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, కిసా న్ పార్టీ బీఆర్ఎస్ గులాబీ జెండా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో గొప్ప విజయాలను నమోదు చేస్తుందని స్పష్టంచేశారు.