హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతోంది. ఐదో రోజు లక్షా 51 వేల 468 మంది రైతుల ఖాతాల్లో 265.18 కోట్ల నగదు జమ అయింది. 5 లక్షల 30 వేల 371.31 ఎకరాలకు నిధులు విడుదలయ్యాయి.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. రైతుల ముఖాల్లో ఆనందం చూడటమే సీఎం కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ లేక, సాగునీళ్లు లేక రైతాంగం వ్యవసాయం వదిలేసి వలసబాట పట్టారని గుర్తు చేశారు. బోరు బావుల కింద వ్యవసాయం చేయలేక రైతాంగం నష్టాల పాలయ్యారు. కేవలం ఎనిమిదేండ్లలోనే తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపం మారిపోయిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్ పథకాలు చారిత్రాత్మకమైనవి అని తెలిపారు.
వ్యవసాయరంగం బలపడితేనే దేశం పటిష్టంగా ఉంటుందన్నారు. తెలంగాణ పథకాలు చూసి దేశ రైతాంగం బీఆర్ఎస్ వైపు చూస్తున్నదని తెలిపారు. సంపద పెంచాలి.. ప్రజలకు పంచాలి అన్నదే కేసీఆర్ విధానం అని పేర్కొన్నారు. 47.75 లక్షల మందికి ప్రతి నెలా ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.. ఇందులో చిన్న, సన్నకారు రైతులు కూడా ఉన్నారని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.